దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అమెరికాలోని లూసియానాలో గల సదరన్ యూనివర్సిటీకి చెందిన తెలుగు విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ లాంటి ప్రజా నాయకుడిని కోల్పోవటం దురదృష్టకరమనీ, ఆయన లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని ఈ సందర్భంగా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పేద ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమానికి విశేషంగా పాటుబడ్డ వైఎస్సార్ సేవలు గణనీయమని తెలుగు విద్యార్థులు తమ సంతాప సందేశంలో వెల్లడించారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం పథకాల ద్వారా ఆయన తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచారన్నారు. మంచి మనసులకు మరణం లేదనీ, వైఎస్సార్ గొప్ప దార్శనికత గల నాయకుడని వారు ప్రశంసించారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేసిన విద్యార్థులు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఇదిలా ఉంటే... తెలుగువారి ఖ్యాతిని ప్రపంచదేశాలకు వ్యాప్తి చేసిన ఘనత వైఎస్సార్దేనని తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా) తమ సంతాప సందేశంలో పేర్కొంది. అమెరికాలోని హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా ఆడిటోరియంలో జరిగిన వైఎస్సార్ సంస్మరణ సభలో వైఎస్సార్ క్లాస్మేట్లు, పలువురు వైద్యులు, పలు రంగాల ప్రముఖులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ ఆశయ సాధన కోసం ఆయన తనయుడు జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.