లండన్లో సిక్కు మహిళలు, పిల్లలతో ప్రయాణిస్తున్న బస్సుకు సంభవించిన అగ్నిప్రమాదం వెనుక జాతివివక్ష శక్తుల ప్రమేయం ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. లూటన్లోని గురుద్వారాను సందర్శించి, దక్షిణ ఇంగ్లండ్లోని వేమౌత్కు తిరిగి వస్తుండగా, జాతీయ రహదారిపై బస్సుకు నిప్పంటుకున్న సంగతి తెలిసిందే..!
ఈ ఘటనలో విధి నిర్వహణలో లేని పోలీసు ఒకరు అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటలు అంటుకున్న సమయంలో ఆ బస్సులో 66 మంది మహిళలు, చిన్నపిల్లు ఉండగా... వారంతా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. మనసు కలచివేసే ఈ దుర్ఘటన మూడు రోజుల క్రితం జరిగింది.
అయితే బస్సునుంచి క్షేమంగా బయటపడిన సిక్కులు... తోటీ దేశస్థుల జాతి విద్వేష వ్యాఖ్యల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. నడిరోడ్డుపై సహాయం కోసం ఎదురుచూస్తున్న తమపై దారిన పోయేవాళ్లు జాతి పేరుతో దూషించారని ఇంద్రజిత్ కౌర్ అనే ఓ ప్రయాణీకురాలు కంటతడి పెట్టటమే దీనికి నిదర్శనం.
" వెళ్లి ఆ మంటల్లోనే చావచ్చుగా...!" అంటూ తమను అమానుషంగా దూషించారని మిగిలిన ప్రయాణీకులు కూడా వాపోయినట్లు తెలుస్తోంది. మోటార్సైకిల్పై వచ్చిన దుండగులు జాతివివక్షతోనే తమ బస్సుపై దాడి చేసి ఉండవచ్చన్న అనుమానాన్ని కూడా కౌర్ వ్యక్తం చేయడం గమనార్హం. కాగా... ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.