ఎన్నో ఆశలతో ఉద్యోగం కోసం గల్ఫ్కు వెళ్లిన ఓ ఆంధ్రుడు అర్ధాంతరంగా మరణించాడు. అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన షేక్ యూసుఫ్ బాషా అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు ఉద్యోగం కోసం గత జూలై నెలలో గల్ఫ్లోని రియాద్కు చేరుకున్నాడు.
తన మామ ఎస్.కే. ముజఫర్తో కలిసి రియాద్లో నివసిస్తున్న బాషా... అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో ఎలక్ట్రీషియన్గా ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. అయితే గత బుధవారం రోజున అతడు తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అతడి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరావటం లేదు.
ఇదిలా ఉంటే.. బాషా మామ ముజఫర్ మీడియాతో మాట్లాడుతూ.. బాషాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, అతడికి తానే సౌదీ వీసా ఇప్పించాననని, అతని తమ్ముడు కూడా రియాద్లోనే పనిచేస్తున్నాడని తెలిపారు. కాగా... తమ కుమారుడి మృతదేహాన్ని తమకు అప్పగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ బాషా తల్లిదండ్రులు భారత రాయబార కార్యాలయానికి విన్నవించుకున్నారు.