దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా ఏడవ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు అమ్మవారు రెండు చేతులతో కమలాలను ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని.
మహాలక్ష్మీ, మహా సరస్వతీ అనే రూపాల్ని ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేశారు. మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడ్ని సంహరించింది. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి. "యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా" అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి.
శ్రీమహాలక్ష్మి రూపాన్ని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. "ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా" అనే మంత్రమును 108 మార్లు జపించవలెను. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను. లక్ష్మీ స్తొత్రములు పఠించవలెను. బెల్లంతో చేసిన క్షీరాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. మహాలక్ష్మి స్తోత్రం యూ ట్యూబ్ నుంచి...