జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. శశికళ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు... ఆమె బుధవారం కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఇందుకోసం చెన్నై నుంచి బుధవారం ఉదయం రోడ్డు మార్గంలో బయలుదేరిన శశికళ.. సాయంత్రానికి బెంగుళూరుకు చేరుకున్నారు.
ఆ తర్వాత అక్కడ కోర్టు నిబంధనలు ముగించుకుని నేరుగా పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారానికి వెళ్ళిపోయారు. శశికళ వెంట భర్త నటరాజన్తో పాటు. కొందరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రెండో రోజైన గురువారం ఉదయం భార్యతో మిలాఖత్ జరిపేందుకు నటరాజన్ ప్రయత్నించారు. అది సాధ్యపడలేకపోవడంతో శశి తరపు న్యాయవాది మాత్రం మిలాఖత్ జరిపారు.
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకె ఐటీ శాఖను కూడా రంగంలోకి దింపారు. శశికళకు వ్యతిరేకంగా మీమ్స్ను రూపొందిస్తున్న వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే ఐటీ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.