భారత్లో హిందువులను 100 శాతంగా చేయడమే తమ లక్ష్యమని వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియా ప్రకటించారు. ఒకపుడు ప్రపంచంలో హిందువులు మాత్రమే ఉండేవారని ఆయన గుర్తు చేశారు. కానీ, ఇపుడు హిందూ దేశమైన భారత్లో 82 శాతం మంది హిందువులు ఉన్నారని, ఈ సంఖ్యను వంద శాతానికి చేరుస్తామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా సాగుతున్న మతమార్పిడులపై తీవ్రమైన చర్చ, రచ్చ జరుగుతున్న నేపథ్యంలో తొగాడియా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపేలా ఉన్నాయి. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇండియాలో హిందువుల జనాభాను తగ్గించి మైనారిటీలుగా చేయాలన్న కుట్రలను అడ్డుకుంటామన్నారు.
గతంలో కొందరి బలవంతంమీద మతాలను మార్చుకున్న వారు తిరిగి హిందూ మతంలోకి రావచ్చని, ఇందుకోసం 'ఘర్ వాపసి' పేరిట ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. కాగా, ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో 500 మంది గిరిజనులను హిందూ మతంలోకి మార్చినట్టు వీహెచ్పీ ప్రకటించిన విషయం తెల్సిందే. వీరంతా నిరుపేద క్రైస్తవులు, ముస్లింలుగా కొనసాగుతూ వచ్చారని ప్రకటించింది.a