ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్కు స్వల్ప ఊరట లభించింది. ఈనెల 10వ తేదీన తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఒక్క రోజు మాత్రం రాష్ట్రపతి పాలనకు మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. బల పరీక్ష సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపింది.
అయితే అనర్హత వేటు పడిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ విశ్వాస పరీక్షలో ఓటు వేయడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విశ్వాస పరీక్షను ఈ నెల 10న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని, ఆ సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు జరగదని పేర్కొంది. సభా పరీక్ష నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి ఈ నెల 10తో తెర పడే అవకాశం ఉంది.