"భారత సైన్యం మాట్లాడదు. తానేం చేయగలదో చేసి చూపుతుంది".. ప్రధాని మోడీ
"భారత సైన్యం మాట్లాడదు. తానేం చేయగలదో చేసి చూపుతుంది. కాశ్మీరు లోయలోని ప్రజలకు ఎవరు జాతి వ్యతిరేకులన్న సంగతి తెలుస్తోంది. శాంతి, ఐకమత్యమే భారత విజయానికి కారణం. మన సమస్యలకు పరిష్కారం కూడా అదొక్కటే. దేశ
"భారత సైన్యం మాట్లాడదు. తానేం చేయగలదో చేసి చూపుతుంది. కాశ్మీరు లోయలోని ప్రజలకు ఎవరు జాతి వ్యతిరేకులన్న సంగతి తెలుస్తోంది. శాంతి, ఐకమత్యమే భారత విజయానికి కారణం. మన సమస్యలకు పరిష్కారం కూడా అదొక్కటే. దేశంలోని ప్రజలందరి బాధ్యతా కేంద్ర ప్రభుత్వానిదే. ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుంది" అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ఆదివారం తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో యురీ దాడి ఘటనపై మాట్లాడారు. ఈ వెన్నుపోటు ఘటనతో భరతజాతి అగ్గిమీద గుగ్గిలమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా సైన్యం గట్టి చర్యలు తీసుకుంటుందనే భావిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, పాకిస్థాన్ వైఖరి, ఉగ్రవాదుల పట్ల ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు తనతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోందన్నారు.
యురీలోని ఆర్మీ బేస్ పై దాడి చేసి 18 మందిని పొట్టన పెట్టుకున్న ఘటన భారతీయులను కలచి వేసిందని అన్నారు. వీర మరణం పొందిన వారికి వందనం చేస్తున్నానని, పదే పదే పాకిస్థాన్ చేస్తున్న తప్పులకు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ను ఏకాకిని చేసి తీరుతామన్నారు.
స్వచ్ఛ భారత్ ప్రారంభించి రెండు సంవత్సరాలు అయిందని, ఈ రెండేళ్ల కాలంలో పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో ఎంతో అవగాహన పెరిగిందన్నారు. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ శుభ్రమైన రహదారులు కనిపించడం మొదలైందని, ఇది తన ఒక్కడి కృషి కాదని, దేశ ప్రజలంతా తన ఆలోచనను పాటిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ను ప్రజల్లోకి చేర్చేందుకు ప్రసార మాధ్యమాలు కూడా కష్టించాయని అన్నారు.
అలాగే, దేశంలో బహిరంగ మల విసర్జనను నూరు శాతం నిర్మూలించేందుకు సరికొత్త ఫోన్ నెంబర్ '1969'ని ప్రారంభిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. 1869లో మహాత్మా గాంధీ జన్మించారని, 1969లో ఆయన శతజయంతి ఉత్సవాలు జరుపుకున్నామని, 2019లో 150వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని గుర్తు చేసిన ఆయన, ఈ నెంబరుకు ఫోన్ చేస్తే, తమ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు ఎంతవరకూ వచ్చాయో తెలుసుకోవచ్చని, ఇప్పటికీ మరుగుదొడ్లు లేని వారు వాటి కోసం రిక్వెస్ట్ చేయవచ్చన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందిస్తుందన్నారు.