నేడు పన్నీర్సెల్వం రాజీనామా.. సీఎంగా శశికళ.. అన్నాడీఎంకేలో వదంతులు
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఓ.పన్నీర్సెల్వం మళ్లీ ఆ పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ముఖ్యమంత్రి పదవికి శనివారం రాజీనామా చేయవచ్చన్నే వదంతులు వస్తున్నాయి. అద
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఓ.పన్నీర్సెల్వం మళ్లీ ఆ పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ముఖ్యమంత్రి పదవికి శనివారం రాజీనామా చేయవచ్చన్నే వదంతులు వస్తున్నాయి. అదేసమయంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు స్వీకరించవచ్చని తెలుస్తోంది.
గురువారం అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశంలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన విషయంతెలిసిందే. ఆ సమావేశంలో పాల్గొన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అదేరోజు సాయంత్రం తమ స్వస్థలాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో వారికి పార్టీ అధిష్టానం నుండి ఓ సందేశం అందింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకల్లా శాసనసభ్యులందరూ చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని పేర్కొన్నారు.
అన్నాడీఎంకే ప్రధాన పదవిని శశికళకు అప్పగించాలని పార్టీ నేతలంతా మద్దతు తెలుపుతున్న సమయంలో కొందరు మంత్రులు ఆమెను పార్టీ పదవితో పాటు ముఖ్యమంత్రిగాను ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. ఆ విషయం గుర్తుకు వచ్చిన అన్నాడీఎంకే సభ్యులు కొత్త సీఎంను ఎన్నుకునేందుకే తమను పిలిచి ఉంటారని భావించారు. దీంతో శుక్రవారం ఉదయం సీఎం పన్నీర్సెల్వం రాజీనామా చేయనున్నారని, శశికళను సీఎంగా ఎంపిక చేయనున్నారని వదంతులు బయలుదేరాయి.
శుక్రవారం మధ్యాహ్నానికల్లా అన్నాడీఎంకే శాసనసభ్యులంతా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగబోతోందని వేచి ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ కొత్తనేత శశికళ.. జయలలిత సమాధివద్ద నివాళులు అర్పించేందుకు రానున్నారని, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం అందింది. దీంతో అన్నాడీఎంకే శాసనసభ్యులు శాంతించారు. ఇదిలావుండగా శనివారం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.