చెన్నైలో జూన్ 24వ తేదీ, నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో టెక్కీ స్వాతి దారుణ హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణించే మహిళా ప్రయాణీకుల భద్రతను పెంపొందించే
చెన్నైలో జూన్ 24వ తేదీ, నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో టెక్కీ స్వాతి దారుణ హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణించే మహిళా ప్రయాణీకుల భద్రతను పెంపొందించే దిశగా రైల్వే పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మహిళా భద్రత కోసం స్వాతి మొబైల్ అప్లికేషన్ పేరిట మొబైల్ ఆఫీసును త్వరలో ప్రవేశపెట్టాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) నిర్ణయించారు. ఈ మొబైల్ ఆఫీస్లో మహిళా భద్రత కోసం అధునాతన వసతులను కల్పించనున్నట్లు తెలిసింది.
ఈ యాప్ను స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చునని.. ''ఎస్ఓఎస్'' పేరిట గల ఐకాన్ను ప్రెస్ చేస్తే పోలీసులకు సమాచారం వెళ్తుందని రైల్వే భద్రాతాధికారులు తెలిపారు. ఇది ఆటో అలెర్ట్ మెసేజ్ ద్వారా సెక్యూరిటీ కంట్రోల్ రూమ్కు సమాచారాన్ని చేరవేస్తుందని చెప్పారు. ఎస్ఓఎస్ ద్వారా మహిళలు తమ భద్రతను కోరుతూ బటన్ ప్రెస్ చేస్తే.. కొన్ని సెకన్లలోనే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుంటారని ఆర్పీఎఫ్ ఉన్నతాధికారి అష్రఫ్ తెలిపారు.
స్వాతి హత్యానంతరం ఆమె పేరునే ఈ యాప్కు పెట్టేందుకు.. ఇందుకు ఆమె కుటుంబీకుల అనుమతి కూడా తీసుకున్నామని అష్రఫ్ వెల్లడించారు. ఈ యాప్ కోసం పోలీసు బలగాలను అదనంగా మోహరించనున్నట్లు అష్రప్ వెల్లడించారు. ఇదిలా ఉంటే స్వాతి హత్య కేసులో రామ్ కుమార్కు 3 రోజుల పాటు రిమాండ్లో ఉంచాలని ఎగ్మోర్ న్యాయస్థానం పేర్కొంది. స్వాతి హత్య కేసులో నెల్లైకి చెందిన రామ్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రామ్కుమార్ను ప్రత్యక్ష సాక్షులు గుర్తించిన నేపథ్యంలో ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించాల్సిందిగా ఎగ్మోర్ కోర్టులో నుంగంబాక్కం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. రామ్ కుమార్ మానసికంగా, శారీరకంగా పోలీసులచే వేధింపులకు గురయ్యాడని.. ఆతని ప్రాణానికి ముప్పు పొంచివుందని ఆతని తరపు న్యాయవాది కోర్టులో అభ్యంతరం తెలిపారు.
గొంతులో గాయం కారణంగా రామ్ కుమార్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడని.. చికిత్స అతడికి అవసరమని న్యాయవాది మేజిస్ట్రేట్ను కోరారు. ఇరు తరపు వాదనలను విన్న కోర్టు రామ్ కుమార్ను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. రోజూ గంట పాటు రామ్ కుమార్ను అతని తరపు న్యాయవాది కలిసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పేర్కొంది. ఇంకా రామ్ కుమార్కు తగిన వైద్య చికిత్సలు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.