అగస్టా హెలికాప్టర్ల స్కామ్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ స్కామ్ ద్వారా సమకూరిన డబ్బంతా జెనీవా బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బ్యాంకులో ఆమె పేరు సిగ్నోరా గాంధీగా పేర్కొన్నట్టు సమాచారం.
అగస్టా వెస్ట్ల్యాండ్ వివిఐపి చోపర్ స్కామ్పై ఇటాలియన్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో 'సిగ్నోరా గాంధీ' అనే పేరు బయటకు రావడంపై కూడా వివాదం తలెత్తింది. మిలన్ కోర్ట్ ఆఫ్ ఆప్లీస్ (ఇటాలియన్ కోర్టు) 225 పేజీల తీర్పులో 'సిగ్నోరా గాంధీ' అనే పేరును ప్రస్తావించడంతో పాటు, కాంగ్రెస్ నేతలు మన్మోహన్ సింగ్, ఆస్కార్ ఫర్నాండెజ్, అహ్మద్ పటల్ పేర్లనూ ప్రస్తావించింది. సిగ్నోరా గాంధీ అనే పేరు ప్రస్తావనకు రావడంతో సదురు పేరు సోనియా గాంధీదేనంటూ బిజెపి విమర్శనాస్త్రాలు సైతం సంధించింది.
ఇదే అంశంపై బీజేపీ ఎంపి సుబ్రహ్మణ్య స్వామి తాజాగా ఈ విషయంలో మరో కీలక సమాచారం వెల్లడించారు. అగస్టా వెస్ట్ల్యాండ్ వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలులో అందుకున్న ముడుపులను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎక్కడ దాచిపెట్టారో తనకు తెలుసన్నారు. ఆ సొమ్మును జెనీవాలోని సరిసిన్ బ్యాంకులో ఆమె దాచిపెట్టారని ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు. ముడుపుల సొమ్ములో కొంతభాగాన్ని పిక్టెడ్ బ్యాంకులో కూడా డిపాజిట్ చేశారని ఆయన పేర్కొన్నారు.