ప్రాణం కోసం పోరాడిన జవాన్ హనుమంతప్ప కన్నుమూశాడు. దేశం వ్యాప్తంగా అతడు కోలుకోవాలంటూ ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హనుమంతప్ప తుదిశ్వాస విడిచారు. మంచు గడ్డల కింద చిక్కుకుని ఆరు రోజుల తర్వాత కొనఊపిరితో బయటపడిన లాన్స్నాయక్ హనుమంతప్ప ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు.
కాగా ఈ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని.. మెదడుకు తగినంత ప్రాణవాయువు సరఫరా కావట్లేదని సీటీ స్కాన్ ద్వారా తెలిసిందని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ ఒక మెడికల్ బులెటిన్లో వెల్లడించింది. ఆస్పత్రికి తీసుకువచ్చినప్పటి నుంచీ ఆయన వెంటిలేటర్పైనే ఉన్నట్టు అందులో పేర్కొంది. నిమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని.. వైద్యులు ఎంతగా కృషిచేసినా, అత్యుత్తమ చికిత్సలు అందించినా శరీరంలోని కీలక అవయవాలు పనిచేయట్లేదని, క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తోందని వివరించింది.
మరోవైపు... ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా బుధవారం ఉదయం ఆర్ఆర్ ఆస్పత్రికి వచ్చి హనుమంతప్పను చూశారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హనుమంతప్ప బతకాలని ప్రార్థిస్తున్నట్టు ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. క్లిష్టవాతావరణ పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి హనుమంతప్పను బతికించేందుకు ఆర్మీ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఐతే హనుమంతప్ప కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.