దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ అత్యాచారాలకు, దోపిడీలు, దొంగతనాలు, అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. ఇప్పటికే రోజుకో వివాదాస్పద వార్తతో ఆ రాష్ట్రం పేరు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో మార్మోగిపోతోంది. తాజాగా, ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లా ఖేడ గ్రామంలో అభం శుభం తెలియని ఓ చిన్నారిపై కామాంధులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు.
తల్లిదండ్రులతో కలిసి ఆరు బయట నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం అనంతరం స్పృహలేని స్థితిలో ఆమెను వదిలిపెట్టి పరారయ్యారు. శనివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో వర్షం రావడంతో తల్లికి మెలకువ వచ్చి చూసేసరికి బాలిక కనిపించలేదు. దాంతో బాలిక కోసం గాలించారు. సమీపంలోని ఓ బావి వద్ద చిన్నారి ఒంటిమీద దుస్తులు లేకుండా స్పృహ కోల్పోయి కనిపించడం చోసూ ఆ తల్లి బోరున విలపించింది.
ఆ తర్వాత పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో మీరుట్ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్పీ అలంకృత సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.