సభకు హాజరుకాని బీజేపీ ఎంపీల భరతం పడతా : ప్రధాని మోడీ ఆగ్రహం
పార్లమెంట్ సమావేశాలకు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టే ఎంపీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి.
పార్లమెంట్ సమావేశాలకు ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టే ఎంపీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని హాజరయ్యారు. ఆయన వచ్చిన సమయంలో మెజార్టీ బీజేపీ ఎంపీలు సభకు హాజరుకాలేదు. ఇది మోడీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
సభలో చాలినంత కోరం లేక పార్లమెంట్ కార్యకలాపాలు ఆలస్యంగా ప్రారంభం కాగా, ఎంపీలంతా పార్లమెంటుకు రావడం కనీస బాధ్యతని, అందరు సభ్యులూ విధిగా రావాలని, తాను ఎవరిని ఏ సమయంలోనైనా పిలుస్తానని, రాకుంటే చర్యలు తప్పవని మోడీ హెచ్చరించారు. పార్లమెంటుకు వస్తే ఎన్నో మంచి పనులు చేయవచ్చని, సభకే రాకుంటే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు
కాగా, సోమవారం కూడా సభ్యుల సంఖ్య సరిపోక సభ ఆలస్యం అయిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లగా, ఎవరెవరు వచ్చారన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. రానివారి జాబితాను తీసుకున్నారు. సభ్యుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, బీజేపీ ఎంపీలంతా తనకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా, సభకు హాజరుకాలేక పోతే పార్టీ అధిష్టానానికి వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన కోరారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.