ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తరహాలోనే కేరళలోనూ ఏ యువతిపై దారుణంగా అత్యాచారం జరిగింది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళ వెళ్ళనున్నారు. కేరళలో అత్యంత పాశవికంగా అత్యాచారం, ఆపై హత్యకు గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఢిల్లీ తరహాలో జరిగిన కేరళ అత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా సంచలనం రేగిన నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ యువతి స్వగ్రామం పెరువంబూరుకు స్వయంగా వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చనున్నారు.
పెరువంబూరులో ఏప్రిల్ 28న ఒంటరిగా తల్లితో కలిసి ఉన్న కుమార్తెపై పాశవికంగా అత్యాచారం, ఆపై హత్య జరిగింది. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు దారుణంగా వ్యవహరించినట్లు పోస్టు మార్టం నిర్వహించిన అలెప్పా మెడికల్ కాలేజీ వైద్యులు వెల్లడించారు. 30 ఏళ్ల దళిత విద్యార్థిని ఒంటిపై భాగాలతో పాటు మొత్తం 35కి మించిన గాయాలున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కేసుపై విచారణ వేగవంతం చేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మోడీ అత్యాచార బాధితురాలి తల్లిని ఓదార్చేందుకు కేరళ వెళ్లనున్నారు.
మోడీతో పాటు సామాజిక న్యాయశాఖ మంత్రి థవర్ చాంద్ గెహ్లాట్ కూడా వెళ్లనున్నారు. ఇకపోతే.. మే 16వ తేదీన జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో.. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, నిందితులను శిక్షిస్తామని కేరళ సీఎం ఉమెన్ చాందీ ప్రకటించారు. బాధితురాలి కుటుంబానికి చెందిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.