జయమ్మ ఇచ్చిన పదవి... తొలగించే అధికారం శశికళకు లేదు : పన్నీర్ సెల్వం
అన్నాడీఎంకే కోశాధికారి పదవి పదేళ్ళ క్రితం దివంగత జయలలిత తనకు కట్టబెట్టారని, ఆ పదవి నుంచి తొలగించే అధికారం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శశికళకు లేదని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం స్పష్ట
అన్నాడీఎంకే కోశాధికారి పదవి పదేళ్ళ క్రితం దివంగత జయలలిత తనకు కట్టబెట్టారని, ఆ పదవి నుంచి తొలగించే అధికారం ప్రస్తుత ప్రధాన కార్యదర్శి శశికళకు లేదని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం స్పష్టంచేశారు. పైగా, తన తిరుగుబాటు వెనుక డీఎంకే ఉందని శశికళ ఆరోపించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
మెరీనా తీరంలోని జయలలిత సమాధి సాక్షిగా పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. దీంతో పార్టీ కోశాధికారి పదవి నుంచి పన్నీర్సెల్వంను తొలగిస్తూ శశికళ ఆగమేఘాలపై ఆదేశాలు జారీ చేశారు. వీటిపై పన్నీర్ సెల్వం స్పందించారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి తనను తొలగించే అధికారం ఆమెకు ఎక్కడిదంటూ మండిపడ్డారు. తన తొలగింపునకు డీఎంకే కారణమని చెప్పడం సరికాదన్నారు.
తను తదుపరి తీసుకునే చర్యలు అన్నాడీఎంకే శ్రేణులు, తమిళనాడు ప్రజల ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పారు. పదేళ్ల క్రితం అమ్మ(దివంగత సీఎం జయలలిత) తనకు ఇచ్చిన పార్టీ పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అమ్మ ఆశయాల కోసమే తాను పార్టీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని, అలాగే ఇప్పుడు కూడా కొనసాగుతానని స్పష్టం చేశారు. అంతేగాక, తాను పార్టీని వీడేది లేదని, కొన్ని గంటల్లోనే తానేంటో నిరూపిస్తానని హెచ్చరించారు. తనను ద్రోహి అన్న శశికళ వర్గంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత స్టాలిన్ ఎదురుపడితే నవ్వడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు.