భారత ఆర్మీలో పని చేసే జవాన్లు పెళ్లి చేసుకున్న తర్వాత తమ సతీమణులను వదిలిపెట్టి సరిహద్దుల్లో విధులు నిర్వహించడానికి వెళ్లాల్సి ఉంది. దీంతో అనేక మంది జవాన్లు తమ జీవిత భాగస్వామితో గడపలేక పోయామన్న బాధతో కాలం వెళ్లదీస్తుంటారు. ఇలాంటివారికి న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) ఒక నిర్ణయానికి వచ్చింది.
కొత్తగా పెళ్లైన సరిహద్దు జవాన్లకు భార్యలతో యేడాది పాటు కలిసి ఉండే అవకాశాన్ని కల్పించాలని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) భావిస్తోంది. బీఎస్ఎఫ్ డీజీ కె.కె.శర్మ రెండు రోజుల క్రితం జరిగిన జవాన్ల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
పెళ్లయిన వెంటనే భార్యల నుంచి, కుటుంబం నుంచి దూరం కావటం జవాన్ల పని తీరుపై ప్రభావాన్ని చూపుతుందని, కాబట్టి ఈ నిర్ణయం తీసుకొన్నామని బీఎస్ఫ్ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని ప్రణాళికాబద్ధంగా అమల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు.