పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఓ వైపు అరుణ్ జైట్లీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుంటే, మరో పక్క మోడీ ట్విట్టర్లో ట్వీట్ల మోత మోగించారు. బడ్జెట్లో మధ్య తరగతి, పేద, యువతకు పెద్ద పీట వేస్తున్న బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నందుకు అరుణ్ జైట్లీ గారిని అభినందించాల్సిందేనన్నారు.
భవిష్యత్లో భారత్ వెలిగిపోవడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు. సురక్షా భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జీవన్ జ్యోతి భీమా యోజన, విద్యాలక్ష్మి కార్యక్రమ్ లాంటివి జన్ ధన్ నుండి జన్ కళ్యాణ్ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. బ్లాక్ మనీని రప్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని అందులో భాగంగా బడ్జెట్లో కొత్త చట్టాన్ని ప్రతిపాదించామని అన్నారు.
దేశంలో 2022 నాటికి అందరికి ఇళ్లు, ఉద్యోగాలు, విద్య, విద్యుత్, ఆరోగ్యం అందిస్తామని ఆ దిశగా బడ్జెట్ ఉందని అన్నారు. బడ్జెట్ ప్రోగ్రెసివ్, పాజిటివ్, ప్రాక్టికల్ గా ఉందని ట్వీట్ చేశారు. పనిలో పనిగా ప్రధాని మోదీ భారత శాస్ర్తవేత్తల గొప్పదనాన్ని కీర్తించారు. దేశ అభివృద్దిలో శాస్ర్తవేత్తల పాత్ర ఎంతో కీలకమని, ప్రస్తుతం మనం మెరుగైన పరిస్థితుల్లో ఉన్నామంటే దానికి శాస్ర్తవేత్తల కృషి కారణమని ఆయన అన్నారు.