రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి రైలు పట్టాలపై పడిన ఓ వృద్ధురాలు.. ఆమెపై రెండు బోగీలు దాటుకుంటూ వెళ్లినా.. స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఘట్కోపర్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. ఫ్లాట్ ఫామ్ నుంచి జారి పట్టాల మధ్యలో పడిపోయిన ఆ వృద్ధురాలిని చూసి లోకల్ ట్రైన్ మోటర్మెన్ బ్రేక్ కూడా వేశాడు. అయినప్పటికీ రెండు బోగీలు ఆమెను దాటుకుంటూ వెళ్లాయి. అయితే అదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు స్వల్ప గాయాలతో బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. అమృత్నగర్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల ప్రమీలా బాబన్ పోఖర్కర్ ఫ్లాట్ఫాంపై నడుచుకుంటూ వెళ్తుండగా పట్టాలపై పడిపోయింది. పట్టాలపై ప్రమీలను చూడగానే.. రైల్లో అప్రమత్తంగా ఉన్న మోటర్మెన్ బ్రేక్లు వేశాడు. అయితే రెండు బోగీలు ఆమె మీదినుంచి వెళ్లిన తర్వాతే రైలు ఆగింది. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలికి చిన్న గాయం తప్ప పెద్దగా గాయాలు లేకపోవడంతో స్థానికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే సీసీటీవీ ఫుటేజ్ల్లో మాత్రం ప్రమీల.. తనంత తానుగా దిగి.. పట్టాలపై పడుకున్నట్లుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కానీ.. ప్రమీల మాత్రం తాను ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించలేదంటోంది. ప్రమీలా కుమార్తె తల్లికి మనస్థిమితం లేదని చెప్తోంది.