ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఐఏఎస్ అధికారులు బలిపశువులుగా మారుతున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వంలో తాము పని చేయలేమనీ, అందువల్ల తమను మరో ప్రాంతానికి బదిలీ చేయాలంటూ వారు కేంద్ర హోంశాఖకు లేఖలు రాసినట్టు సమాచారం.
లెఫ్టినెంట్ గవర్నర్కు ఢిల్లీ సీఎంకు మధ్య మధ్య ప్రచ్ఛన్న యుద్ధ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ రాజకీయ యుద్ధం ఐఏఎస్ అధికారులకు తలనొప్పిగా మారింది. గత కొద్ది రోజులుగా అధికారుల మార్పు చేర్పులు, గవర్నర్ చెబితే కేజ్రీవాల్ కాదంటుండడం, కేజ్రీ నియమిస్తే గవర్నర్ చెల్లదనడం, కార్యాలయాలకు తాళాలు ఇత్యాది ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
దీంతో విసిగి పోయిన అధికారులు ఇక తమ వల్ల కాదు, బదిలీ చెయ్యండో అని మొరపెట్టుకుంటున్నారు. వీరి యుద్ధంలో తాము బలిపశువులం కాలేమంటూ 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఢిల్లీ ప్రభుత్వం నుంచి తమను తప్పించి మరోచోటకు పంపాలని హోం శాఖను కోరారని తెలుస్తోంది. కేజ్రీవాల్ ప్రభుత్వం తమను పీడిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ వివాదాలకు పరిష్కారం కనుక్కుంటామని, కాస్తంత ఓపిక పట్టాలని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.