హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన నాచారం పారిశ్రామిక వాడలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రారిశ్రామికవాడలోని రోడ్ నెంబరు 18లో ఉన్న శాలిస్లైట్ రసాయన పరిశ్రమలో రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో సమీపంలోని ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని 10 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, రియాక్టర్లతో పాటు.. గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను అదుపుచేయలేక పోతోంది.
మరోవైపు.. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఘటనాస్థలిని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని రసాయన ట్యాంకర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.