రాజ్యసభ నుంచి తనను వెలివేయడం ఉన్మాద చర్యగా లిక్కర్ డాన్ విజయ్ మాల్యా అభిప్రాయపడ్డారు. రూ.వేల కోట్లు రుణం తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను రాజ్యసభ సభ్యత్వం నుంచి బహిష్కరిస్తూ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై విజయ్ మాల్యా స్పందించారు. రాజ్యసభ నుంచి బహిష్కరిస్తూ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయడం తప్పుడు చర్యగా అభివర్ణించారు. తనను వెలివేయడానికి అనుసరించిన విధానాన్ని దుయ్యబడుతూ తీవ్రవ్యథతో ఆయన నేరుగా రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి ఒక లేఖ రాశారు.
'ఇది నాకెంతో విచారం కలిగిస్తోంది. రాజ్యసభ సహచరులు ఉన్మాదంలో పడిపోయి ఈ నిర్ణయానికి వచ్చారు. చాలా బాధగా ఉంది. ఈ పరిణామాలు నిరాశ కలిగించాయి' ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో మీడియాలో తనపట్ల అనవసరంగా, బాహాటంగా అవధుల్లేని ద్వేషం సృష్టించారనీ, తనను తీవ్ర అప్రతిష్టపాలు చేశారనీ, రాజ్యసభ సహచరులు కూడా ఈ ఉన్మాదంలో పడిపోయి తనను సభ నుంచి బహిష్కరిస్తూ సిఫారసు చేశారని ఆ లేఖలో మాల్యా విమర్శలు గుప్పించారు.