రాజ్యాంగ ధర్మాసనానికి ట్రిపుల్ తలాక్ పిటిషన్లు: మార్చి 30న విచారణ
ఇస్లాం సంప్రదాయాల కిందకు వచ్చే ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణ బాధ్యత రాజ్యాంగ ధర్మసనానికి సుప్రీం కోర్టు అప్పగించింది. ఇందుకోసం ఐదుగురితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయన
ఇస్లాం సంప్రదాయాల కిందకు వచ్చే ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంపై దాఖలైన పిటిషన్ల విచారణ బాధ్యత రాజ్యాంగ ధర్మసనానికి సుప్రీం కోర్టు అప్పగించింది. ఇందుకోసం ఐదుగురితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేయనుంది. ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం విషయంలో తీర్పు కోరుతూ నాలుగు అంశాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఉంచింది. వాటిలో ఈ అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (1), ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లకు అనుగుణంగా ఉన్నాయా? అని ప్రశ్నించింది. వీటిపై స్పందించిన కోర్టు రాజ్యాంగ అంశాలు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని పేర్కొంది.
దీనిపై చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలు చాలా ముఖ్యమైనవని.. ఇంకా సాగదీయకూడదని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలన్నీ రాజ్యాంగానికి సంబంధించినవని.. అందుచేత విస్తృత ధర్మాసనం అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఈ కేసులను మార్చి 30న రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది.