భార్యను చంపేశాడు.. ఆమె మృతదేహాన్ని మంచం కింద ఉంచాడు. దానిపైనే పరుపు వేశాడు. ప్రేయసితో ఉల్లాసంగా గడిపాడు. దుర్గంధం వచ్చేసరికి గోనెసంచిలో భార్య మృతదేహాన్ని రోడ్డుపై పారేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఢిల్లీలోని షగార్పూర్లో చోటుచేసుకుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు భద్రత కరువైంది. అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.
తాజాగా ఢిల్లీ షగార్పూర్ రోడ్డుకు సమీపంలో ఓ గోనె సంచి నుంచి దుర్గంధం రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గోనె సంచిలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. విచారణలో ఆ మృతదేహం హలీమాదని తేలింది. ఆపై పోలీసులు జరిపిన విచారణలో హలీమాను ఆమె భర్త ఫెరోజ్ ఖాన్ హత్య చేసినట్లు తేలింది. అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు తన వాంగ్మూలంలో జరిగిందేంటో చెప్పేశాడు.
తన భార్య హలీమాతో మనస్పర్ధలు ఏర్పడటంతో విడిపోయామని.. ఆపై పూజ అనే అమ్మాయితో తనకు పరిచయం ఏర్పడిందని చెప్పాడు. పూజతో సహజీవనం చేయడం తన భార్యకు నచ్చలేదని, ఈ వ్యవహరంపై ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవని చెప్పుకొచ్చాడు. హలీమా తరచూ తగాదాకు దిగడంతో ఆమెను చంపేసినట్లు ఫెరోజ్ చెప్పాడు. ఇందుకు పూజ కూడా సహకరించిందని వెల్లడించాడు.
హలీమాను చంపేసిన తర్వాత మృతదేహాన్ని బాక్సులో పెట్టి మంచం కింద పెట్టామని.. దానిపై పరుపు పేర్చి.. రెండు రోజుల పాటు తాను పూజ నిద్రించామని చెప్పాడు. ఇక పూజ మృతదేహం నుంచి దుర్గంధం రావడంతో దాన్ని రోడ్డుపై విసిరేసినట్లు ఫెరోజ్ చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు.