ఢిల్లీ జేఎన్యులో తమిళ విద్యార్థి సూసైడ్ ... రోహిత్ వేముల స్నేహితుడే...
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థి గతంలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ వేముల స్నేహితుడే కావడం గమనార
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విద్యార్థి గతంలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ వేముల స్నేహితుడే కావడం గమనార్హం.
ఈ విద్యార్థి పేరు ముత్తుకృష్ణన్. చరిత్ర విభాగంలో ఎంఫిల్ చేస్తున్నాడు. తమిళనాడులోని సేలంకు చెందిన 27 ఏళ్ల ముత్తుకృష్ణన్ మానసిక కుంగుబాటు సమస్యతో ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. గత ఏడాది జనవరిలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేములకు ఇతను మిత్రుడు. ఇద్దరూ కలిసి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకునేవారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని జేఎన్యూ పక్కనే ఉన్న మునిర్కాలో ముత్తుకృష్ణన్ మిత్రులు కొందరు అద్దెకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం భోజనం చేయడం కోసం ముత్తుకృష్ణన్ వారి ఇంటికి వెళ్లారు. భోజనం తర్వాత కాసేపు పడుకుంటానని గదిలోకి వెళ్లి తలుపేసుకున్నారు. అక్కడే సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఫ్రెండ్స్ మళ్లీ వర్సిటీకి వెళ్దామని ఎంత తలుపుకొట్టినా తలుపు తీయలేదు. దాంతో పోలీసులకు ఫోన్ చేశారు. సాయంత్రం ఐదు గంటలకు పోలీసులు తలుపులు బద్దలు కొట్టినపుడు ముత్తుకృష్ణన్ ఉరేసుకొని కనిపించాడు. గదిలో ఎలాంటి లేఖా లేదు. అయితే, ఇటీవల ఫేస్బుక్ పోస్టులో మాత్రం జేఎన్యూలో వివక్ష గురించి ప్రస్తావించారు.
ముత్తుకృష్ణన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఏ చదివారు. రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం జరిగిన విద్యార్థి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఫేస్బుక్లో అనేక పోస్టులు రాశారు. రోహిత్ వేముల తల్లి రాధికకు అనుకూలంగా వ్యాసాలు కూడా రాశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.