భర్తలిద్దరూ వేరే కాపురం పెట్టేశారు: పోలీస్ స్టేషన్లో భార్యల ఫిర్యాదు
ఇద్దరబ్బాయిలు.. అక్కాచెల్లెళ్లైన ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. ఏమైందో ఏమోకానీ ఆ అక్కాచెల్లెళ్ల భర్తలిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది. ఈ క్రమంలో తమ భార్యలను వదిలేసి.. కాపురం పెట్టేశారు ఆ
ఇద్దరబ్బాయిలు.. అక్కాచెల్లెళ్లైన ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. ఏమైందో ఏమోకానీ ఆ అక్కాచెల్లెళ్ల భర్తలిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోయింది. ఈ క్రమంలో తమ భార్యలను వదిలేసి.. కాపురం పెట్టేశారు ఆ తోడళ్లుళ్లు. ఈ వింత ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 2010లో సదరు కుటుంబంలోని పెద్దమ్మాయికి పెళ్లైంది. వారికో బాబు కూడా పుట్టాడు. 2013లో ఆమె చెల్లికి పెళ్లయింది. కాగా, పెద్దల్లుడు మరదలి భర్తతో సన్నిహితంగా మెలిగేవాడు. అల్లుళ్లు ఇద్దరూ కలుపుగోలుతనంతో ఉన్నారనుకుని అందరూ భ్రమపడ్డారు. కానీ విడదీయలేనంత దగ్గరయ్యారని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. వారి బంధం ముదిరిపాకనపడింది. దీంతో కట్టుకున్న భార్యలను వదిలేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే ఆ ఇద్దరూ కట్టుకున్న భార్యలను వదిలేసి సంవత్సరం నుంచి వేరు కాపురం పెట్టారు. ఈ పరిణామంతో కంగుతిన్న ఆ అక్కాచెల్లెళ్లు భర్తల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ స్టేషన్లో కూడా వీరికి చుక్కెదురైంది. వారిద్దరిని విడిగా ఉండమని చెప్పే హక్కు చట్టప్రకారం లేదని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పడానికి మాత్రమే అవకాశం ఉందని చెప్పారు.
ఈ నేపథ్యంలో వారిద్దరూ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. తమ భర్తలు హింసిస్తున్నారని, నిర్లక్ష్యం చేస్తున్నారని గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇటీవల విచారణకొచ్చింది. కోర్టు కూడా ఆ ఇద్దరు మహిళలను పోషించేందుకు అవసరమయ్యే ఖర్చులను చెల్లించాలని భర్తలను ఆదేశించింది. అనంతరం కేసును నవంబర్ 19కి వాయిదా వేసింది.