ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో ఉన్న సహీద్ లక్ష్మమ్ నాయక్ వైద్య మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంజెక్షన్ వికటించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్థరాత్రి కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. వైద్య సిబ్బంది ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని మృతుల కుటుంబూ సభ్యులు ఆరోపిస్తున్నాయి.
ఐసీయూ, సర్జికల్ వార్డులలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఐదుగురు వ్యక్తులు గత రాత్రి మరణించారు. అంతకు ముందు కొన్ని నిమిషాల ముందు ఆస్పత్రి సిబ్బంది వీరికి రెండో విడత ఇంజెక్షన్లు ఇచ్చినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
అర్థరాత్రి సమయంలో ఒక నర్సు మా పక్కనే ఉన్న ముగ్గురు రోగులకు ఇంజెక్షన్ ఇచ్చింది. మా సోదరీకి కూడా అదే ఇంజెక్షన్ వేసింది. అది వేసిన కొన్ని గంటల్లోనే ఆమె తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయింది. మేము డాక్టర్ను పిలిచి, ఆయన వచ్చి పరీక్షించేలోపు ఆమె ప్రాణాలు విడిచింది అని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.