తమిళనాడులోని మధురై ప్రాంతానికి సమీపంలోనున్న చోళవందన్ రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రగాయాలపాలైనారు.
మధురై జిల్లాలోని చోళవందన్ రైల్వే స్టేషన్లో మంగళవారం భారీ పేలుడు జరగడంతో ముగ్గురు మృతి చెందగా ఆరుగురికి తీవ్రగాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
మైలాడుదురై నుంచి తిరునల్వేలీకి వెళుతున్న ప్యాసింజర్ రైలు చోళవందన్ రైల్వే స్టేషన్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఈ పేలుడు సంభవించింది. మృతుల్లో టీటీఈ మరియు ఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
పేలుడుకు తగిన కారణాలు ఇంకా తెలియరాలేదని, బహుశా టపాసులకు సంబంధించిన మందుగుండు సామగ్రి రవాణా చేస్తున్న సందర్భంలో ఈ దుర్ఘటన జరిగివుండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
ఏదేమైనప్పటికీ ఉగ్రవాదులేమైనా ఈ చర్యలకు పాల్పడ్డారేమోననే కోణంలో కూడా తాము విచారణ చేపట్టామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే రైల్వే స్టేషన్ జనాలతో నిండిపోయిందని, తీవ్రగాయాలపాలైనవారిని తాము చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు వివరించారు.