స్నేహ సంబంధాల పునరుద్ధరణలో భాగంగా దాయాది దేశం పాకిస్థాన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు భారతీయ జనతా పార్టీ కూడా సముఖంగానే ఉందని ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ స్పష్టం చేశారు. అయితే, తీవ్రవాదులపై పాక్ కఠిన చర్యలు తీసుకున్నపుడే ఇది సాధ్యమని ఆయన తేల్చి చెప్పారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అద్వానీ యూపీఏ ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంలోని యూపీఏ ప్రభత్వంతో తమకు రెండు ప్రధాన అంశాలపైనే అభిప్రాయభేదాలు ఉన్నాయని గుర్తు చేశారు.
వాటిలో ఒకటి అవినీతి. రెండోది తీవ్రవాదం. అయితే, ఈ రెండు అంశాల్లో తీవ్రవాదంపై యూపీఏ ప్రభుత్వం మెతక వైఖరిని అవలంభించడాన్ని తాము సహించబోమన్నారు. ఇటీవల ఈజిప్టులో జరిగిన ఒక సదస్సులో సైతం ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రవాదం ఊసెత్తకుండా ప్రసంగించడాన్ని అద్వానీ తప్పుబట్టారు.
ముఖ్యంగా, పాక్ చర్చల పునరుద్ధరణలో తీవ్రవాద అంశాన్ని చేర్చక పోవడం విస్మయానికి గురి చేసిందన్నారు. పాక్తో చర్చలకు తామెపుడూ అడ్డు చెప్పడం లేదన్నారు. అయితే, ఆ గడ్డపై నుంచి మన దేశంలో విధ్వంసం సృష్టించిన తీవ్రవాదులపై పాక్ కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఈ చర్చలు జరుపరాదన్నదే తమ ప్రధాన డిమాండ్ అని అద్వానీ నొక్కివక్కాణించారు.