జమ్ము- కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ప్రత్యేక దేశాలుగా మారిపోయాయి. ఆహార వ్యవసాయ సంస్థ తన నివేదికలో ఈ రెండు రాష్ట్రాలను ప్రత్యేక దేశాలుగా పేర్కొంది. అంతేకాదు ఈ రెండు దేశాలు తూర్పు ఆసియా దేశాలంటూ వెల్లడించడం గమనార్హం.
2010 సంవత్సరానికి గాను పాల ఉత్పత్తి రంగానికి సంబంధించి గ్రీన్ హౌస్ వాయువులను వెలువరిస్తున్న దేశాల వివరాలను తెలుపుతూ ఈ రెండు రాష్ట్రాలను రెండు దేశాలుగా సూచించింది.
అరుణాచల్ ప్రదేశ్ను అరుణాషల్ ప్రదేశ్గా పేర్కొంది. అంతేకాదు అక్సాయ్ చిన్ అనే ప్రాంతాన్ని కూడా ప్రత్యేక దేశంగా నివేదికలో జోడించింది. కాగా అక్సాయ్ చిన్ ప్రాంతం తమ భూభాగంలోనిదని చైనా అంటుంటే... కాదు కాదు.. అది జమ్ము-కాశ్మీర్లో అంతర్భాగమని భారతదేశం చెపుతోంది.
దీనిపై సంస్థ అధికారులను అడిగితే, తాము పేర్కొన్న దానిలో తప్పేమీ లేదని అంటున్నారు. ఏదేని దేశంలో వివాదాస్పద భూభాగం ఉన్నట్లయితే వాటిని అలాగే పరిగణిస్తామని చెప్పుకొచ్చారు.