జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని రెయాసీ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ఓ కీలక కమాండర్ హతమయ్యాడు. భద్రతా దళాలు ఈ రోజు ఓ కీలక లష్కరే తీవ్రవాదిని హతమార్చాయని అధికారిక వర్గాలు తెలిపాయి. జిల్లాలోని మహోర్ ప్రాంతంలోని బాటోయి అడవిలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో పాకిస్థాన్కు చెందిన జుమాన్ అనే తీవ్రవాది మృతి చెందాడు. అతడికి అబు జిందాల్, మొహమ్మద్ అవాయిస్ పేర్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇతనితోపాటు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాల్లో మరో ఇద్దరు తీవ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారి గురించిన వివరాలు తెలియరావాల్సివుంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం జమ్ముకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.