దేశాన్ని కుదిపేసిన గోద్రా ఘటన అనంతరం గుజరాత్ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయే కారణమంటూ కోర్టుకెక్కిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్పై గుజరాత్ ప్రభుత్వం బహిష్కరణ వేటు వేసింది. గోద్రా మతకలహాల సమయంలో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని భట్ ఆరోపిస్తూ.. గుజరాత్ ప్రభుత్వంతో నేరుగా తలపడ్డారు.
ప్రస్తుంతం జునాగఢ్లోని ఎస్ఆర్పి ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపాల్గా ఉన్న ఆయనను ఐపిఎస్ అధికారి స్థాయికి తగ్గట్టుగా నడుచుకోలేదంటూ తొలగించారు. ఈ మేరకు ఓ లేఖను రాష్ట్ర హోంశాఖ అధికారులు భట్ నివాసానికి వెళ్లి అందజేశారు.
సస్పెండ్ ఉత్తర్వులు అందుకున్న అనంతరం సంజీవ్ భట్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తనను సస్పెండ్ చేసింది. తక్షణమే అమలయ్యేలా ఉత్తర్వులిచ్చారు. వారేమనుకుంటే అది చేయొచ్చని ముక్తసరిగా మాట్లాడారు.