రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చేపట్టే కార్యక్రమాలకు ప్రజాధనం వినియోగిస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత కార్యక్రమాలకు ప్రజాధనం ఖర్చు చేయడమేమిటని ఆ రాష్ట్ర మైనార్టీలు, గిరిజన నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల ఆర్ఎస్ఎస్కు చెందిన ధర్మ జాగరణ్ విభాగ్ (మత పునర్ధురణ శాఖ) సంస్థ ఈ వారంతంలో మా నర్మదా సామాజిక్ కుంభ్ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టనుంది. ఈ నెల 10 తేదీ నుంచి 12 తేదీ వరకు గిరిజనులు అధికంగా ఉండే మాండ్ల జిల్లాలో నిర్వహించే ఈ కార్యమ్రానికి ప్రత్యక్ష మద్దతు అందించేలా ప్రభుత్వం ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున మళ్లించినట్లు ఆరోపణలొస్తున్నాయి.
ఈ కుంభమేళాకు మధ్యప్రదేశ్ సర్కారు ఏకంగా మూడు వేల ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి మాండ్ల జిల్లా యంత్రాంగం సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్టు జిల్లా యంత్రాంగం కూడా స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త రోడ్లు వేయడం, రోడ్ల మరమ్మతులు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలకు ఏకంగా రూ.250 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై మైనారిటీ, గిరిజన సంస్థల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ మధ్యప్రదేశ్ సర్కారు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది.