జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను చేపట్టగలదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
82 మంది సభ్యులు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీలో భాజపాకు 21 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సామూహిక రాజీనామా చేసిన విషయం తెల్సిందే. జార్ఖండ్లో గత జనవరి నుంచి రాష్ట్రపతి పాలనలో ఉంది.
దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. భాజపా రాష్ట్ర శాఖ చీఫ్ రఘువీర్ దాస్ ఎన్నికల సంఘం కమిషనర్ ఎస్.వై.ఖురేషీని కలిసి వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు.
అయితే, నిర్ణీత కాలపరిమితికి అంటే ఆరు నెలల ముందుగా ఎన్నికలను ఈసీ నిర్వహిస్తుందని ఖరేషీ తమ ప్రతినిధి బృందానికి చెప్పారని యశ్వంత్ సిన్హా తెలిపారు. కాగా, జార్ఖండ్ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే యేడాది మార్చి పదో తేదీతో ముగియనుంది.