భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యేందుకు తాను అమితాసక్తితో ఉన్నట్టు ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. కామ్ అధినేత జెఫ్ బెజోస్ తెలిపారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బెజోస్, ఇక్కడి మార్కెట్ తీరుతెన్నులు, పండగ వాతావరణానికి మంత్రముగ్ధులయ్యారు. ఇటీవల భారత్ ప్రయోగించిన మార్స్ మిషన్పై పొగడ్తలు గుప్పించిన ఆయన అవకాశం ఉంటే, భారత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోడీ వ్యవహారశైలిపై ఆయన స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో మోడీ, అందరికంటే ముందున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించిన ఆయన.. మోడీతో భేటీపై అమితాసక్తితో ఉన్నానన్నారు.
ఇదిలావుంటే, భారత్లో అమెజాన్ క్లౌడ్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు బెజోస్ సూత్రప్రాయ ప్రకటన జారీ చేశారు. ఇటీవలే మైక్రోసాఫ్ట్, తన డేటా సెంటర్ను భారత్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెజాన్ కూడా తన డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటనతో భారత మార్కెట్ను మరింతమేర ఒడిసిపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.