ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో ఇంటర్నెట్ తప్పనిసరి అయింది. ప్రపంచాన్ని కళ్లముందు చూపించే నెట్కు లభిస్తున్న ఆదరణ అంతాఇంతా కాదు. అయితే, భారత దేశంలోని మహిళలు మాత్రం అంతర్జాలంపై అంతగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. దేశంలో 49 శాతం మంది మహిళలు అంతర్జాలానికి దూరంగానే ఉంటున్నారట.
ఈ విషయం ప్రముఖ ఇంటర్నెట్ సేవల సంస్థ 'గూగుల్' అధ్యయనం ద్వారా వెల్లడైంది. ‘ఉమెన్ అండ్ టెక్నాలజీ’ పేరిట నిర్వహించిన ఈ అధ్యయనంలో భాగంగా 8 నుంచి 55 ఏళ్ల వయస్సున్న 828 మంది మహిళలను ప్రశ్నించారు. ఇందులో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా మహిళలు ఇంటర్నెట్ కనెక్షన్ పొందే వీలు లేకపోవడం, నెట్ ఖర్చును భరించలేకపోవడం, సమయం చిక్కకపోవడం వంటి కారణాలతో మహిళలు ఇంటర్నెట్కు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.
ఇంటి పనులతో అలసిపోతున్న మగువలు ఖాళీ దొరికినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతర్జాలంపై ఆసక్తి చూపడం లేదు. ఆన్లైన్లో ఎక్కువ సమయం గడిపితే అత్తామామలు ఆగ్రహిస్తారనే భయంతో చాలామంది దీని జోలికి వెళ్లడం లేదు. ఇంటర్నెట్తో అనుసంధానం కావడానికి తగిన స్వేచ్ఛ కావాలని మహిళలు కోరుకుంటున్నారని గూగుల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది.