లిక్కర్ డాన్ విజయ్ మాల్యా పాస్ పోర్టును భారత విదేశాంగ శాఖ రద్దు చేసినప్పటికీ.. ఆయనను తమ దేశం నుంచి వెనక్కి పంపించలేమని బ్రిటన్ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషనరేట్కు సమాచారం చేరవేసింది.
దేశంలోని పలు జాతీయ బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్ల ఎగవేసిన విజయ్ మాల్యా... గత మార్చిలో గుట్టుచప్పుడు కాకుండా లండన్ వెళ్లిపోయారు. తిరిగి భారత్కు రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినా.. మాల్యా స్పందించలేదు. దీంతో కేంద్ర విదేశాంగ శాఖ మాల్యా పాస్పోర్టును రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో మాల్యాను స్వదేశానికి పంపించాలని భారత ప్రభుత్వం ఇటీవల యూకే ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. పాస్పోర్టు రద్దు చేసినా కూడా తమ దేశ చట్టాల ప్రకారం మాల్యాను పంపించలేమని చెప్పింది. అయితే మాల్యాను వెనక్కి రప్పించడానికి భారత్కు సాయం చేస్తామని ప్రకటించింది.