నేను ముస్లింలకు మాత్రమే కాకుండా అందరికీ ప్రధాన మంత్రిని: హిందువులకు షరీఫ్ గుడ్ న్యూస్
పాకిస్థాన్లో మైనారిటీల ప్రార్థనా స్థలాలను కాపాడాలని, యాత్రికులకు ఆతిథ్యం ఇవ్వాలని ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. తాను ముస్లింలకు మాత్రమే కాకుండా అందరికీ ప్రధాన మంత్రినని స్పష్టం చేశ
పాకిస్థాన్లో మైనారిటీల ప్రార్థనా స్థలాలను కాపాడాలని, యాత్రికులకు ఆతిథ్యం ఇవ్వాలని ఆ దేశ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. తాను ముస్లింలకు మాత్రమే కాకుండా అందరికీ ప్రధాన మంత్రినని స్పష్టం చేశారు. పాకిస్థాన్ త్వరలోనే మైనారిటీల మిత్ర దేశంగా గుర్తింపు పొందుతుందని షరీఫ్ ఉద్ఘాటించారు. హిందువుల పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన కటాస్ రాజ్ కాంప్లెక్స్లో ఆయన మాట్లాడుతూ తమ దేశంలో అన్ని మతాల వారికీ సమాన హక్కులు ఉండేవిధంగా విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ చర్యలు మెజారిటీలను, మైనారిటీలను సమానంగా చూడాలన్న ఇస్లామిక్ సిద్ధాంతంలో భాగమన్నారు. పాకిస్థాన్ ప్రశాంతంగా, సౌభాగ్యవంతంగా ఉండేందుకు ముస్లింలు, హిందువులు, సిక్కులు, పార్శీలు, బహాయిలు, క్రైస్తవులు చేతిలో చేయి వేసి కృషి చేస్తున్నారని, దేశాన్ని కాపాడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కటాస్ రాజ్ కాంప్లెక్స్లో 'అమృత్ జల్' పేరుతో రక్షిత మంచినీటి ప్రాజెక్టును నవాజ్ షరీఫ్ ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో ఓ మొక్కను కూడా నాటారు.
ఇస్లామాబాద్కు సమీపంలో ఉన్న చక్వాల్ జిల్లాలోని కటాస్ రాజ్ కాంప్లెక్స్ పునరుద్ధరణకు బుధవారం నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిన్నరలోగా ఈ దేవాలయం పునరుద్ధరణ జరగాలని గడువు విధించారు.