చైనా వాల్ను దొంగలు చోరీ చేస్తున్నారు... మాయమై పోతున్న ప్రపంచ వారసత్వ సంపద!
చైనా వాల్... ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచి మింగ్ రాజులు (1368-1644) పరిపాలించిన కాలం వరకు ఈ గోడను దశదశలుగా నిర్మించారు.
చైనా వాల్... ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుంచి మింగ్ రాజులు (1368-1644) పరిపాలించిన కాలం వరకు ఈ గోడను దశదశలుగా నిర్మించారు. అయితే, ఈ గోడ ఇపుడు రోజురోజుకూ కనుమరుగై పోతోందట. గోడ ఏంటి.. కనుమరుగై పోవడమేంటనే కదా మీ సందేహం. ఈ వాల్ను దొంగలు దోచుకుంటున్నారట. అదెలాగంటారా..?
చైనా గోడ నిర్మాణం కోసం వినియోగించిన రాళ్ళు, ఇటుకలను దొంగలు ఒక్కొక్కటిగా చోరీ చేస్తున్నారట. ఈ కారణంగా ఈ వాల్ అదృశ్యమై పోతోందట. ఫలితంగా దాదాపు 21 వేల కిలోమీటర్ల పొడుగు ఉండే గోడ ఇప్పుడు శిథిలంగా మారుతోంది. రాళ్లు, ఇటుకలు ఎత్తుకెళ్లుతున్న దొంగలను పట్టుకునేందుకు చైనా ప్రభుత్వం కూడా కఠినమైన నిర్ణయాలను తీసుకున్నప్పటికీ.. ఫలితం కనిపించడం లేదు.
ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం కోసం చైనా వాల్ ఇటుకలను దొంగలిస్తున్నారు. విదేశీ పర్యాటకులకు అమ్మేందుకు కూడా ఆ ఇటుకలను చోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వానలు, బలమైన గాలులు వల్ల సహజసిద్ధంగానే చైనా గోడ కొంత శిథిలావస్థకు చేరుకుంది. దీనికి తోడు దొంగల వల్ల కూడా ప్రపంచ వారసత్వ సంపదకు అపాయం వాటిల్లింది.