మయన్మార్ ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీతోపాటు రాజకీయ ఖైదీలందరినీ అధికార జుంతా నిర్బంధం నుంచి విడిచిపెట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ డిమాండ్ చేశారు. మయన్మార్లో ప్రజాస్వామ్య స్థాపన కోసం ఏళ్ల తరబడి పోరాటం సాగిస్తున్న సూకీని, ఇతర నేతలను అధికార మిలిటరీ జుంతా నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే.
సూకీ గత 19 ఏళ్లలో సుమారు 14 ఏళ్లపాటు గృహ నిర్బంధంలోనే గడిపారు. భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు ఆమెపై ఓ కేసు కూడా నడుస్తోంది. ఈ కేసులో తీర్పు ఆగస్టు 11న వెలువడనుంది. ఈ నేపథ్యంలో బాన్ కీ మూన్ మాట్లాడుతూ.. సూకీతోపాటు, ఇతర రాజకీయ ఖైదీలను మయన్మార్ మిలిటరీ జుంతా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. మయన్మార్ అధికారిక యంత్రాంగం కూడా తమ విజ్ఞప్తులను సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామన్నారు.