తమపై వివిధ రకాలుగా దాడులు జరుపుతున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు తమ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని పాకిస్థాన్ తాలిబన్ అధిపతి హకీముల్లా మెహసూద్ హెచ్చరించారు. అమెరికా జరుపుతున్న దాడుల్లో తాము నష్టపోయిన మాట వాస్తవమేనన్నారు. అయితే, నైన్యం చేతిలో తమ వారు ఓడిపోలేదని తగిన సమయం చూసుకుని తడాఖా చూపిస్తామని ఆయన హెచ్చరించారు.
దీనిపై హకీముల్లా మాట్లాడుతూ పాకిస్థాన్లోని దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికా మానవరహిత విమానాల (డ్రోన్ల) దాడులతో సహా, సైన్యం దాడులు ఎక్కువయ్యాయన్నారు. దీంతో తమ సైనికులు తీవ్రంగా నష్టపోయిన మాట వాస్తవమేనన్నారు.
జనవరి వరకు వేచి ఉండి అప్పుడు తమ ప్రతాపాన్ని చూపుతామని ఆయన వజీరిస్థాన్లో గుర్తు తెలియని ప్రాంతం నుంచి సిఎన్ఎన్ న్యూస్ ఛానల్ ప్రతినిధికి ఫోన్లో తెలియజేశారు. గత ఆగస్టులో అమెరికన్ డ్రోన్ల దాడుల్లో పాకిస్థాన్ తాలిబన్ అధిపతి బైతుల్లా మెహసూద్ మరణించడంతో ఆయన బాధ్యతలను హకీముల్లా చేపట్టిన విషయం తెల్సిందే.
ఈ మంచుకాలంలో తాము తిరిగి పుంజుకుంటామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సైనికులు తాలిబన్ల స్థావరాల్లో పెక్కింటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, అగ్రశ్రేణి తాలిబన్ నాయకుడెవరూ పట్టుబడటం కానీ, మరణించడం కానీ జరగలేదని ఆయన తెలిపారు. సైన్యం స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో హకీముల్లా సొంత పట్టణం కూడా ఉన్న సంగతి విదితమే.