అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్కు అందజేసిన ఆర్థిక సాయాన్ని రక్షణావసరాలకు మళ్లించామని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. తీవ్రవాదంపై పోరు కోసం అమెరికా ప్రభుత్వం పాక్కు భారీగా ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
అయితే పాక్ ఈ నిధులను భారత్కు పోటీగా ఆయుధాలు తయారు చేసేందుకు ఉపయోగించిందని గతంలో అనేకసార్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా తీవ్రవాదంపై పోరుకు ఉద్దేశించిన అమెరికా మిలిటరీ ఆర్థిక సాయాన్ని పాకిస్థాన్ రక్షణావసరాలకు ఉపయోగించిందని ముషారఫ్ వెల్లడించారు.
పాకిస్థాన్ అత్యున్నత పదవిని అలకరించిన వ్యక్తులు ఈ విషయాన్ని ధృవీకరించడం ఇదే తొలిసారి. భారత్కు పోటీగా ఆయుధాలు అభివృద్ధి చేసేందుకు అమెరికా సాయాన్ని ఉపయోగించామని ముషారఫ్ అంగీకరించడంతో.. మిలిటరీ సాయానికి సంబంధించిన అమెరికా నిబంధలను పాక్ ప్రభుత్వం ఉల్లంఘించినట్లు స్పష్టమయింది.
పాకిస్థాన్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ చెప్పారు. పాక్ ప్రభుత్వం ఆర్థిక సాయం నిబంధనలను ఉల్లంఘించడంపై అమెరికా యంత్రాంగం ఇప్పుడు ఆగ్రహం చెందినా తానేమీ ఖాతరు చేయబోనన్నారు.