పాకిస్థాన్ను గత రెండేళ్లుగా తీవ్రవాద దాడులతో వణికిస్తున్న తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ బైతుల్లా మెహసూద్ మరణించాడని ఆ గ్రూపు ప్రతినిధులు ధృవీకరించారు. మెహసూద్ నేతృత్వంలోని తాలిబాన్ గ్రూపు గత రెండేళ్లుగా సాగించిన మారణహోమంలో వందలాది మంది పౌరులు మృతి చెందారు.
మృతుల్లో పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి బేనజర్ భుట్టో కూడా ఉన్నారు. భుట్టో హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన బైతుల్లా మెహసూద్ అమెరికా దళాలు పాకిస్థాన్లోని సమస్యాత్మక దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో ఆగస్టు 5న జరిపిన దాడిలో మృతి చెందాడని తెహ్రీక్ ఎ తాలిబాన్ తీవ్రవాద సంస్థ శుక్రవారం ధృవీకరించింది.
ఈ దాడిలో మెహసూద్, ఆయన రెండో భార్య మృతి చెందినట్లు తెలిపింది. మెహసూద్ అంత్యక్రియలు నార్కోసా గ్రామంలో గురువారం జరిగినట్లు తాలిబాన్ గ్రూపు వెల్లడించింది. తెహ్రీక్ ఎ తాలిబాన్ అధిపతి మరణించడంతో, కొత్త చీఫ్ను ఎంపిక చేసేందుకు ఈ తీవ్రవాద గ్రూపు సలహా మండలి శుక్రవారం సమావేశం కానుంది. కొత్త అధిపతి నేతృత్వంలో అమెరికా వ్యతిరేక అజెండాతో తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు తాలిబాన్ ప్రతినిధులు వెల్లడించారు.