పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్ ఇటీవల అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మరణించి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా సేనలు ఇటీవల పాకిస్థాన్లోని మెహసూద్ ఇంటిపై డ్రోన్తో దాడి చేశాయి. ఈ డ్రోన్ దాడిలో మెహసూద్ భార్య మృతి చెందినట్లు పాకిస్థాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
భార్యతోపాటే మెహసూద్ కూడా మరణించి ఉండవచ్చని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ గురువారం రాత్రి అనుమానం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన డ్రోన్ దాడిలో భార్య, అనుచరులతోపాటు, మెహసూద్ కూడా మృతి చెందివుండవచ్చని మాలిక్ పేర్కొన్నారు.
మెహసూద్ అమెరికా డ్రోన్ (మానవరహిత యుద్ధ విమానం) జరిపిన క్షిపణి దాడిలో మరణించాడని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయన్నారు. అయితే తమ వద్ద దీనికి సంబంధించి బలమైన ఆధారాలేవీ లేవని మాలిక్ జియో టీవీ ఛానల్తో చెప్పారు. ఇదిలా ఉంటే అమెరికా అధికారిక యంత్రాంగం కూడా మెహసూద్ మరణించినట్లు అనుమానిస్తోంది.
అయితే ఈ వార్తలను ధృవీకరించేందుకు తమ వద్ద కూడా ఆధారాలేవీ లేవని తెలిపింది. పాకిస్థాన్లోని సమస్యాత్మక దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో అమెరికా డ్రోన్ జరిపిన దాడిలో మెహసూద్ భార్య మృతి చెందినట్లు పాకిస్థాన్ అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆదివారం పాక్ ప్రభుత్వం మెహసూద్ను పట్టుకోవడానికి సాయపడినవారికి 615,000 డాలర్ల నజరానా అందజేస్తామని తెలిపింది. గత రెండేళ్లలో పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన తీవ్రవాద దాడులకు మెహసూద్ నేతృత్వంలోని తాలిబాన్ గ్రూపు కారణమని పాక్ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది.
పాకిస్థాన్ తాలిబాన్ గ్రూపు జరిపిన తీవ్రవాద దాడుల్లో వందలాది మంది పౌరులు మృతి చెందారు. పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసులోనూ మెహసూద్ ప్రధాన నిందితుడు.