పాకిస్థాన్లోని తాలిబాన్ తీవ్రవాద సంస్థ అధినేత బైతుల్లా మసూద్ అమెరికా రక్షణ బలగాలు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోలేదని తాలిబన్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రెండు రోజుల క్రితం అమెరికా సైన్యం నిర్వహించిన వైమానికి దాడుల్లో బైతుల్లా మరణించిన పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ వ్యవహారంపై నోరుమెదపని తాలిబాన్ తీవ్రవాద సంస్థ శనివారం మాత్రం ఆకస్మాత్తుగా ఒక ప్రకటన చేసింది.
పాకిస్థాన్లోని తమ సంస్థ కీలకనేత బైతుల్లా మసూద్ అమెరికా వైమానిక దాడుల్లో మృతి చెందలేదని ఆఫ్గనిస్థాన్లోని తాలిబాన్ తీవ్రవాద సంస్థ కీలక నేత హకీముల్లా మసూద్ స్పష్టం చేశారు. బైతుల్లా మృతిపై అమెరికా, పాకిస్థాన్ ప్రభుత్వాలు చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలావుండగా, వైమానిక దాడుల్లో బైతుల్లా మృతి చెందలేదని పాకిస్థాన్కు చెందిన జియో న్యూస్ ఛానల్ కూడా శనివారం స్పష్టం చేసింది. ఈ వార్తలను బీబీసీ న్యూస్ కూడా సమర్థించింది.