పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ విదేశాంగ శాఖ జారీ చేసే పాస్పోర్టుల కాల పరిమితిని ఐదేళ్ళ నుంచి పదేళ్ళకు పొడగించినట్టు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ చెప్పారు.
అల్లమా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐబీఎంఎస్)ను ప్రారంభించిన తర్వాత ఈ విషయాన్ని మంత్రి మాలిక్ ప్రకటించారు. ఈ కొత్త కాలపరిమితి సెప్టెంబరు నెల నుంచి అమలుకు వస్తుందని చెప్పుకొచ్చారు.
అలాగే, తమ ప్రభుత్వం చట్టవ్యతిరేక సిమ్ కార్డులను వినియోగించేందుకు అంగీకరించబోదన్నారు. అంతేకాకుండా, దేశ భద్రత దృష్ట్యా వినియోగదారుల సమాచారం తెలుసుకునేందుకు వీలులేని అనుమానాస్పద సిమ్ కార్డులను బ్లాక్ చేసేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు.
ఈ కొత్త విధానం వల్ల ఎఫ్బిఆర్ పన్ను వసూళ్ళకు కూడా ఎంతగానో దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. అలాగే, ఎయిర్ పోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన నద్రా వల్ల సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.