దక్షిణ తైవాన్లో తపాను కారణంగా ఏర్పడిన వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ గ్రామంపై కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో వందలాది మంది పౌరులు సజీవ సమాధి అయ్యారు. వరదల కారణంగా అనేక ఇళ్లు, పాఠశాలలు నేలమట్టమయ్యాయని పోలీసులు చెప్పారు. శిథిలాల కింద వందలాది పౌరులు ఇరుక్కుపోయారని వెల్లడించారు.
మొరాకోత్ తుపాను చైనా తీరాన్ని తాకే ముందు తైవాన్లో విలయతాండవం చేసింది. ఈ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పెద్దఎత్తున వరదలు సంభవించాయి. గత 50 ఏళ్లలో తైవాన్ ఈ స్థాయి వరదలను ఎన్నడూ చూడలేదు. తుపాను కారణంగా రెండు మీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
చైనాలోనూ మొరాకోత్ తుపాను లక్షలాది మంది పౌరులకు కన్నీళ్లు మిగిల్చింది. చైనాలో ఈ తుపాను కారణంగా పది లక్షల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. ఇదిలా ఉంటే అంతకుముందు మొరాకోత్ తుపాను ఫిలిప్పీన్స్లోనూ భీభత్సం సృష్టించింది. ఫిలిప్పీన్స్లో తుపాను కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 22 మంది మృతి చెందారు. తైవాన్లో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మృతుల సంఖ్యపై అధికారిక వర్గాలు ఇప్పుడే అంచనాకు రాలేకపోతున్నాయి.