చావు హక్కుపై సలహా ఇవ్వాలని కోరుతూ ఆ ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్ ఆస్ట్రేలియా కోర్టులో విచారణకు వచ్చింది. చావును కోరుకుంటున్న వ్యక్తి కోరికను మన్నించడంపై తీర్పు ఇవ్వాలని ఈ పిటిషన్లో సదరు ఆస్పత్రి విజ్ఞప్తి చేసింది. క్రిస్టియన్ రోసిటెర్ (49) వేర్వేరు ప్రమాదాల్లో శరీరాన్ని గుల్ల చేసుకున్నారు.
30 మీటర్లు ఎత్తున్న భవనంపై నుంచి కిందపడి ప్రాణాల నిలుపుకున్న క్రిస్టయన్ను ఆ తరువాత మోటార్సైకిల్ వెళుతుండగా కారు ఢీకొంది. ఈ రెండు ప్రమాదాల్లో క్రిస్టియన్ ప్రాణాలతో బయటపడినప్పటికీ, శరీరంలోని అవయవాలన్నీ నాశనమయ్యాయి. కేవలం ప్రాణాలు మాత్రమే ఉన్న ఆయన వాటిని కూడా తీసుకోవాలని బలంగా కోరుకుంటున్నారు.
నేను చావాలనుకుంటున్నాను. నా సొంత శరీరంలోనే బందీగా బతుకుతున్నాను. ఎటూ కదల్లేను. కనీసం కన్నీళ్లను కూడా తుడుచుకోలేని స్థితిలో ఉన్నానని ఈ వారం క్రిస్టియన్ విలేకరులతో చెప్పారు. నాకు చావు అంటే భయం లేదు. అయితే బాధ అంటే బయపడతాను. బాధకే తాను భయపడతానని తెలిపాడు.
ఆహారం కూడా తీసుకోలేని క్రిస్టియన్కు వైద్యులు ట్యూబ్ ద్వారా శరీరంలోకి ఆహారాన్ని పంపిస్తున్నారు. బతుకుతూ నరకాన్ని అనుభవిస్తున్నాను. ఈ నరకం నుంచి బయటపడాలనుకుంటున్నానని క్రిస్టియన్ చెప్పాడు. అతని కోరికపై చావు హక్కు కోరుతూ పెర్త్లోని బ్రైట్వాటర్ కేర్ గ్రూపు పశ్చిమ ఆస్ట్రేలియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇదిలా ఉంటే 1995లో ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రావీన్స్ ప్రభుత్వం చావు హక్కుకు న్యాయబద్ధత కల్పించి అంతర్జాతీయ స్థాయిలో దూమారం సృష్టించింది. మరణించే హక్కుకు న్యాయబద్ధత కల్పించడంతో తొమ్మిది నెలల కాలంలో నలుగురు వ్యక్తులు స్వచ్ఛందంగా ప్రాణాలు తీసుకున్నారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. చివరకు 1996లో ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసింది.