జగన్నాథస్వామి రథయాత్ర సందర్భంగా పూరీలో శనివారం భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. భక్త జనం అధికం కావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కటక్ తరలించారు.
ఈ సహస్రాబ్దికే తొలి నవకళేబర యాత్ర ఒడిశాలోని పూరిలో అత్యంత వైభవంగా కొనసాగుతోంది. కట్టుదిట్టమైన భద్రత, లక్షలాది భక్తుల నడుమ జగన్నాథుడు బలభద్ర, సుభద్ర సమేతుడై రథాలపై వూరేగుతున్నారు. పురుషోత్తముని నామస్మరణతో పూరి పరిసరాలు మార్మోగుతున్నాయి. అత్యంత విశిష్టతను సంతరించుకున్న నవకళేబర యాత్రతో జగన్నాథస్వామి, బలభద్ర స్వామి, సుభద్ర అమ్మవారు నూతన దేహంతో భక్తులకు దర్శనమిస్తున్నారు.
పూరీక్షేత్ర తొక్కిసలాట మృతులకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.