రాజకీయాల్లో ప్రవేశించి చురుకుగా వ్యవహరించేందుకు తమ కుమారుడు జూ.ఎన్టీఆర్ కు అప్పుడే తొందరేమీ లేదని నందమూరి హరికృష్ణ అన్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం రాజకీయ వేడి రగులుతోంది. పలు రాజకీయ పార్టీలకు సినిమా తారలు ప్రచారంలోకి దిగుతున్నారు. పవన్కళ్యాణ్ ఏకంగా పార్టీనే పెట్టినా ఇప్పట్లో తాను పోటీ చేయడం లేదని క్లారిటీగా చెప్పేశాడు.
కానీ.. తన సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయనీ, అవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా... నెరవేర్చకపోతే ప్రశ్నించే హక్కు ఉందనీ పోరాడతామనీ అంటున్నారు. ఇలా మరో ఐదేళ్ళు పోరాడి అప్పడు పార్టీని బలోపేతం చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పనిలోపనిగా జూనియర్ ఎన్టిఆర్ కూడా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తాడేమోనని వార్తలు విన్పిస్తున్నాయి. ఇటీవలే కేంద్ర కమిటీ మీటింగ్లో హరికృష్ణ పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల నాయకులకు, క్యాడర్లకు ఆయన ఏవిధంగా ప్రచారం చేయాలో వెల్లడించారు.
ఈ సందర్భంగా హరికృష్ణను సన్నిహితులు ఎన్టిఆర్ గురించి ప్రస్తావిస్తే.. ఇప్పుడే జీవితం, సినిమా అనే రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మూడో బాద్యత అప్పుడే ఎందుకంటూ దాటవేశారు. ఎన్టిఆర్ అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. రాజకీయాల్లో ఇంకా వచ్చే వయస్సు చాలా ఉందనీ, తొందర పడవద్దని ఎన్టిఆర్కు సందేశాలు పంపుతున్నారని తెలిసింది.